యాత్ర కధనం
- murthydeviv
- 9 minutes ago
- 3 min read
యాత్ర అంటే ఏ పుణ్య ఛేత్రం అనుకోకండి. ఎక్కడికీ వెళ్లినా యాత్ర కదా. మా మనవడికి తిరుపతి దగ్గర శ్రీ సీటీ లో వున్న క్రీయా యూనివర్సిటీ లో సీట్ వచ్చింది.
చిన్నప్పటినుండి నా దగ్గరే ఎక్కువగా పెరగటం వలన అడ్మిషన్ కోసం వెళ్తూ నన్ను కూడా రమ్మన్నాడు.
మా పిల్లలు కి ఒక ఐదు వందల కిలోమీటర్ల పరిధిలో వున్న ఏ ఊరు అయినా డ్రైవింగ్ ప్రిఫెర్ చేస్తారు.
వెళ్లిన చోట వెహికల్ ప్రాబ్లెమ్ ఉండదు అనే కాన్సెప్ట్ తో.
ఇప్పుడు రోడ్స్ బాగున్నాయి కాబట్టి అంత ప్రాబ్లెమ్ ఉండదు కానీ , వెనకటి రోజుల్లో అయితే కొంచెం గొడవ గా ఉండేది..
మా అల్లుడు గారు కొత్తగా నల్గొండ అద్దంకి ఒంగోలు , రోడ్డు అయితే త్వరగా వెళ్తారు అని చెప్పారు .
నల్గొండ , మిర్యాలగూడ తర్వాత కృష్ణ దాటగానే మా అత్త గారి ఊరు , ప్రస్తుతం మా పొలాలు వున్న ఊర్లు వస్తాయి .
అవీ ఎప్పుడూ ఒక నాలుగు గంటల్లో వెళ్తూనే ఉంటాము.
ఇంక అక్కడి నుండీ అద్దంకి వైపు ఎప్పుడూ వెళ్ళ లేదు. అద్దంకి ఊరు పేరు వినగానే మా తాత గారు గుర్తు వచ్చారు.
మా తాతగారు, లేదా మా ముత్తాత గారు అద్దంకి దగ్గర కొత్త కోట అనే ఊరు నుండీ వచ్చారు అని మా నాయనమ్మ
ఎప్పుడూ చెప్తూ ఉండేవారు.
ఆ ఊరు ఒంగోలు దగ్గర అని చెప్పేవారు. అలా ఇప్పుడు అద్దంకి పేరు విన గానే నాకు చాలా సంతోషంగా అనిపించింది.
మా చిన్న తనంలో తాతగారి మేన మామ లు, వాళ్ళ పిల్లలు ఎప్పుడూ మా యింటికి వస్తూ ఉండేవారు .
ఇప్పటిలాగా బంధువుల ఇంట్లో ఉండటానికి మొహమాటం పడే వాళ్ళు కాదు.
తాతగారి తో చుట్టరికం ఏమిటో తెలియదు కానీ ఒకాయన చాలా లావుగా వుండే వారు , ఆయన్ని మేము బొండం తాత గారు అని పిలిచే వాళ్ళము. ఆయన కూడా మాతో సరదాగా కబుర్లు చెప్పి నవ్విస్తూ ఉండేవారు. ఆయన కశ్యపురం అనే ఊరు నుండి వచ్చేవారు , కొంచెం పెద్ద అయ్యాక తెలిసింది ఆయన తాతగారికి మేన మామ అని.
ఇంకొక ఇద్దరు ఒకరు నల్లగా ఇంకొకరు తెల్లగా వుండే వారు, ఉదయాన్నే చక్కటి ఇస్త్రీ ధోవతులు కట్టుకుని తయారు అయిపోయే వారు.
వాళ్ళందరూ ఏవో కోర్ట్ పనులు, లేదా హాస్పిటల్ లో చూపించుకోవటానికి, వచ్చేవారు. ఒక్కొక్క సారి అక్కడ అడవాళ్ళకు డెలివరీలు కష్టం అంటే ఇక్కడకు వచ్చే వారు.
వారం పదిరోజులు ఉండి అన్నీ పనులు చక్కపెట్టుకుని వెళ్ళే వారు. ఎన్ని రోజులు వున్నా బామ్మ గారు , మా అమ్మగారు వాళ్లకు ఎంతో మర్యాద చేస్తూ వుండే వారు.
అద్దంకి లో నాన్నగారు వాళ్లతో ఏదో పెళ్ళికి వెళ్లినట్లు గుర్తు , అన్నీ ఊర్లు లాగానే ఆ ఊరు కూడా నియో కల్చర్ తో బాగా మారిపోయింది. పల్లెటూరు గుర్తులు ఏమీ లేవు.
మీ ఊరు అని కాకుండా ఈ ఊరు మీద కుండా రోడ్డు వేయటానికి ఏమిటో కారణం అని మా అమ్మాయికి డౌట్ వచ్చింది.
బహుశా విజయవాడ హై వే మీద చెన్నయ్ ట్రాఫిక్ తగ్గించాటానికి అయి ఉండ వచ్చు అన్నాను.
తెలుగు సాహిత్యం మీద వున్న ఇంట్రెస్ట్ తో చదివిన ఆరుద్ర గారి పుస్తకం లో చదివిన అద్దంకి పండరంగడి శాసనం గుర్తు వచ్చింది.
వెంటనే గూగుల్ బాబా గారిని అడిగితే అక్కడే గుడి దగ్గర ఆ శాసనం ప్రతిరూపం ఉంది అని చెప్పారు.
మేము ఆ గుడి ఎక్కడ అని అడిగితే ఆ హై వే లోనే ఉంది అని చెప్పారు.
ఆ గుడి రోడ్డు కి చాలా దిగువలో వున్నది. చాలా పాత గుడి కానీ పెద్దగానే వున్నది , మూసి ఉండటం వలన లోపలికి వెళ్ళ లేదు శాసనం మాత్రం చూసాము.
క్రీస్తు శకం 848 సంవత్సరం లో గుణగ విజయా ది త్యు ని సేనాని పండ రంగడు అనే సేనాని తన విజయాలను గురించి తెలుగు పద్యాల్లో రాసిన శాసనం ట ,
మొదట గా తెలుగులో పద్య శాసనం ట , మనకు చరిత్ర కాపాడుకునే అలవాటు లేదు కదా , ఆ రాతి పలక కూడా దుమ్ము, దూళి తో గుడి ముందు ఉంది.
ఆహా మన వూరికి కూడా గొప్ప చరిత్ర ఉంది అని సంతోషం గా అనిపించింది. బహుశా మన పూర్వికులు కూడా ఆ రాజా ఆస్థానాల లో ఏవో కొలువులు చేసి ఉండ వచ్చు. అనుకున్నాను.
ఆ వూరికి దగ్గర లోనే వున్న కొత్త కోట అనే ఊరు తాత గారి సొంత ఊరు అని చేప్పే వారు. అక్కడ కొన్ని భూములు కూడా ఉండేవి అని నాకు గుర్తు.
ఇంకొక సారి వచ్చినప్పుడు ఆ ఊరు వెళ్దాం అనుకుంటూ అక్కడి నుంచీ బయలు దేరాము..
దారిలో వచ్చిన ఒంగోలు , టంగుటూరు
కోవూరు, నెల్లూరు అన్నీ చిన్నప్పుడు తిరిగిన ఊర్లు కదా అనుకుంటూ ఆ కబుర్లు అన్నీ మా పిల్లలు కూ చెప్పాను.
మన మూలాలు ఇక్కడి నుండే కదా అనుకుంటే ఏదో తెలియని ఆనందం వచ్చింది. రూట్స్ నవల కూడా గుర్తు వచ్చింది.
ఆ నవల లో హీరో తన రూట్స్ వెతుక్కుంటూ వెళ్ళితే , నేను అనుకోకుండా తాతగారు పుట్టిన ఊరు చూస్తున్నా కదా అనే ఆనందం కలిగింది.
అవీ ఈ నాటి కబుర్లు శుభరాత్రి
.
Comments