ఉయ్యాల ముచ్చట్లు
- murthydeviv
- 2 days ago
- 3 min read
Updated: 14 hours ago
మొన్న శనివారం మా కజిన్ మనవడిని ఉయ్యాల లో వేస్తున్నాము రమ్మని పిలిచింది మెల్లగా ఓపిక చేసుకుని బయలు దేరాను . కొండలుగా పేరు పొందిన ఈ మూల నుంచీ ట్రాఫిక్ లో ఆ మూల కొత్త పేట చేరేటప్పటికి రెండు గంటలు పట్టింది .
మధ్యలో సుల్తాన్ బజార్, మలక్ పేట అన్నీ చూస్తూ ఉంటే పాత జ్ఞాపకాలు ఆలా గుర్తు కొచ్చాయి . ఆ కబుర్లు ఇంకోసారి చెప్పుకుందాం
వర్జ్యం లేకుండా చూసి బాబుని ఉయ్యాల లో పడుకో పెట్టారుట ఇప్పుడు మాత్రం వాళ్ళ నాన్న వొడిలో ప్రశాంతం గా పడుకున్నాడు . సరే అందర్నీ ఒకసారి కలియ చూసి కబుర్లు చెప్పుకున్నాము. కజిన్స్ అందరమూ ఒకేసారి స్టేజి ఎక్కి బాబు ని ఆశీర్వధించి ఒక గ్రూప్ ఫోటో తీయించుకుని మెల్లగా స్టేజి దిగాము.
ఈ వయసు లో ఆ స్టేజి ఎక్కటము , దిగటం కూడా పెద్ద ప్రయత్నం చేయాలి . ఆ ఫంక్షన్ అయ్యి యింటికి వస్తూ ఉంటే నాకు పూర్వం రోజుల్లో ఉయ్యాల ఫంక్షన్ గుర్తు వచ్చాయి .
ఆ రోజుల్లో 21 రోజున ఉయ్యాల లో వేసే వారు. ఆ రోజు సాయంత్రం ఇంట్లో వున్న అందరం బావి దగ్గరికి వెళ్ళి బావికి పసుపు కుంకుమ పెట్టి నీళ్లు తోడి మూడు చిన్న బిందెల్లో నింపాలి. మూడు రాళ్లు పెట్టి ఆ రాళ్లకు పూజ చేసి తాంబూలం పెట్టే వారు. ఆ తాంబూలం తీసుకునే వాళ్లకు వీపు మీద మూడు దెబ్బలు పడేవి..
ఆ రాళ్లకు కూడా ఏవో తమాషాగా పేర్లు ఉండేవి.
ఆ బిందెలు నీళ్ల తో లోపలికి వస్తూ అందరూ వాళ్ళ భర్త ల పేర్లు చెప్పి తలుపు తీయమని అడగాలి.. అరోజుల్లో తలుపు తీసే భర్తలు వుంటారా అనీ నాకు ఇప్పుడు అనుమానం వస్తున్నది.
అసలు పురుడు అయినప్పటినుంచి నడుము కట్టుతో , తలకు చిన్న స్కార్ఫ్ చెవుల్లో దూది కాళ్ళకు చెప్పులు తప్పని సరి.
ఏ కాలం అయినా వేన్నీళ్లు తాగాల్సిందే , ఇంక ఉదయాన్నే మోడీ కారం ముద్ద తినాలి.
మంచి నెయ్యి వేసి , బెల్లము తో కలిపిన ఆ మోడీ కారం తినటానికి అక్కయ్య ల తో పాటు మేము రెడీ గా ఉండేవాళ్ళము.
పసి పిల్లలు కు జలుబు చేస్తుందేమో అనీ తల్లులు చేత తెగ పత్యం చేయించే వారు . రోజూ తెల్లవారు జామున లేపి పసి పిల్లలు కి ఆముదం మాడు మీద పెట్టే వారు. సాయంత్రం కూడా అలాగే ఆముదం పెట్టి , ఒక పాట పాడేది మా చిన్న బామ్మ గారు.
ఇంక పసిపిల్లలు కు నీళ్లు పోయటం ఆంటే ఒక పెద్ద ప్రహసనం చూస్తూ ఉంటే భయం వేసేది కానీ పెద్ద వాళ్ళు కాళ్ల మీద పడుకోపెట్టుకుని చలాకిగా పొసే వారు. వంటికి నూనె మర్దన చేసి , నలుగు పెట్టి , వేడి నీళ్లు పోసి , సాంబ్రాణి పొగ వేసి
పాలు పట్టి మెత్త టీ బొంతల మీద పడుకోపెడితే ఒక ఐదు ఆరు గంటలు హా యిగా నిద్ర పోయే వారు.
మా అమ్మ గారు పాపాయికి నువ్వులు నూనె మర్దన చేస్తువుంటే మా అత్తగారు వచ్చినప్పుడు నువ్వులు నూనె వేడి అనీ
కొబ్బరి నూనె రాసేవారు.
అపుడే మార్కెట్ లోకి కొత్తగా వస్తున్న జాన్సన్స్ బేబీ కిట్స్ తో మావారు ఢిల్లీ నుండీ దిగారు . ఇంక అందులో వున్న బేబీ ఆయిల్ తో మసాజ్ అయ్యేది
మా అమ్మమ్మ మాత్రం రోజూ నాకు, మా వదినకు ఆముదం రాస్తే పిల్లలు కి ఎంత మంచిదో చెప్తూ ఉండేది.
భోజనం లో వెల్లుల్లి కారం , చింత కాయ పచ్చడి తప్పనిసరి గా తినాలి . మా అమ్మమ్మ మాత్రం మేము సరిగ్గా పత్యమ్
చేయటం లేదు అనీ రోజూ ఒకసారి అయినా క్లాస్ ఉండేది.
ఉయ్యాల కు చిలకల పందిరి తయారు చేయటం ఒక కళ , అమ్మా వాళ్ళు ఆ చిలకలు నిమిషం ల్లో కుట్టి అందులో దూదితో నింపి చిలక ముక్కు కి ఒక బ్రైట్ కలర్ తో కుట్టే వారు.
పాలవెల్లి లాంటి చెక్క కు మంచి మెరిసే రంగు గుడ్డ తో నింపి దానికి చిలకలు వేలాడే ట్లు కుట్టే వారు.
మా అక్కయ్య పిల్లల రోజుల్లో గ్లాక్స్సో పాలు పట్టే వారు , మేము అందరమూ ఆ పాల పిండి తింటూ ఉండేవాళ్ళము. M
మా పిల్లలు టైమ్ కి అమూల్ స్ప్రే వచ్చేసింది. మా అన్నయ్య పెద్ద కూతురు అయితే అచ్చు అమూల్ బేబీ లాగానే ఉండేది..
మా రెండో అన్నయ్య సరదాగా మా పెద్ద వదినకు సరదాగా బేబీ బుక్ గిఫ్ట్ ఇచ్చాడు. మా వదిన తుచా తప్పకుండా ఆ బుక్ ఫాలో అయ్యేది. మా అమ్మగారు పాపాయి ఏడుస్తున్నది పాలు పట్టు ఆంటే మూడు గంటలకు ఒక సారి పాలు పట్టాలి అనేది.
మా అమ్మగారు తర్వాత అన్నయ్య కు వార్నింగ్ ఇచ్చారు, ఇంకెవరికి ఇలాంటి బుక్స్ ఇవ్వకు అనీ.
మా బాబు హైదరాబాద్ లో పుట్టినప్పుడు మా పెద్దమ్మ మా అక్కయ్య చేత ఆ మోడీ కారం దినుసులు అన్నీ తెప్పించి
మంచి నెయ్యి తో చేసి పెట్టింది.
ఇంకా సున్నిపిండి లో కూడా ఏమిటో రక రకలా దినుసులు కలిపి పట్టించింది. మంచి సువాసన తో ఉండేది..
మా పెద్దమ్మ కు కూడా చాలా సరదాలు ఉండేవి. అమ్మమ్మ కి పెద్ద కూతురు కదా మరీ
ఉయ్యాల కి ఆ చిలకల పందిరి కడితే పాపా యిలు ఆ రంగులు చూస్తూ ఆ, ఊ లు అంటూ నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది.
ఆడుకునేటప్పుడు ఆడు కున్నా కొంత మంది పిల్లలు ఉయ్యాల లో నిద్ర పోయే వారు కాదు . వాళ్లకి పాత చీరలు తో గుడ్డ ఉయ్యాల రెడీ .
ముందు ఎన్ని డ్యూయెట్ లు పాడుకున్నా పాపాయిలకు జోల పాట లు వినిపించాల్సిందే. నేను కాలేజీ లో చదువుకునేటప్పుడు మా కజిన్ ఉత్తరం లో ఒక జోల పాట రాసే వాడు సరదాగా , రేడియో మానేసి ఇవే వింటున్నాను అనీ.
అప్పుడు అక్కయ్య కి కొత్తగా పాపాయి పుట్టింది. అదీ వాడి గోల.
సాంబ్రాణి వాసనల తో , కాళ్ళకు పసుపు తో, నడుము కట్టుతో , తాంబూలం తో ఎర్రటి పెదవులు తో బాలింత ఆంటే నే ఒక అందంగా ఉండేది.
విశ్వనాధ గారి పాట గుర్తు వస్తున్నది, కన్నె కాటుక కళ్ళు చిన్ని నాధుని చూసి కదలా డిన వేళ కందలించిన వేళ
ఆకాశ మధ్యాన అట నొక్క తెలి మబ్బు మెరుపు లా మెరిసిందిలే వెలుగు లో వొరిసింది లే
తొలి కాన్పు పసిపాప సాక నేరని బాల , తెల బోయి పతి చూసి కల వలించిన
వేళ
తూరుపు కోనలో తొంగలించిన మబ్బు సొగసుల్లు పోయిందిలే , తెగ పరుగు లెత్తిందిలే
ఈ రోజుల్లో భార్య భర్త లు ఇద్దరూ కలిసి పెంచుతున్నారు కాబట్టి ఈ పాట లు పాడుకో నక్కర్లేదు
ఏమిటో గతం లో జరిగిన కొన్ని గుర్తు వస్తూ ఉంటే ఆనందం గా వుంటుంది.
ఇప్పుడు అయితే మార్కెట్ లో రక రకా ల వస్తువులు పిల్లలు కోసం , డబ్బు ఉంటే ఇల్లు పట్టుకుండా సామాను.
అయితే అరోజుల్లో చేతులతో తయారు చేసిన ఆనందం వేరు మరీ మీరు ఏమంటారు
ఇప్పటికీ ఆ మోడీ కారం రుచి గుర్తు వున్నది చిలక ల పందిరి అయితే సూపర్
ఆ వీ ఉయ్యాల ముచ్చట్లు , భానుమతి గారి పాట గుర్తు చేసుకుందా
ఉయ్యాల జంపాల ఊగా రావయ్య చక్రపాణి సినిమాలో
శుభరాత్రి
.
Comments