దీపావళి కొన్ని జ్ఞాపకాలు
- murthydeviv
- 6 hours ago
- 3 min read
అన్ని పండుగల్లో కి విశిష్టత గల పండుగ దీపావళి. దేశము మొత్తం జరుపుకునే పండగ , అంతే కాక ఈ మధ్య ఇతర దేశాలు సైతం , ఈ పండుగ సందర్భంగా కొంత ఉత్సాహం చూపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు వ్యాపారాల్లో కొత్త పుస్తకాలు అంటే అకౌంట్ బుక్స్ ఈ రోజు నుండీ మొదలు పెడతారు. ఇపుడు ప్రతి పండుగ కు ఏవో కన్ఫ్యూజన్ అమావాస్య ఎపుడు ఉంది , పండగ ఎపుడు చేయాలి, అనే మీమాంసలు. మా చిన్నతనం లో ఇంత విన్నట్లుగా గుర్తు లేదు. నరక చతుర్దశి రోజున తెల్లవారుజామున లేచి నువ్వుల నూనె తో తలంటు కోవాలి , సూర్యోదయానికి ముందుగా తల స్నానం చేయాలి, అని ప్రతి రోజూ టీ వీ ల్లో, యూ ట్యూబ్ లో, ఎంత మందో చెప్తూ వుంటారు. కానీ పాపం ఎవరూ చేయరు. మా చిన్నతనం లో ఒక పది ,పదిహేను రోజుల ముందు నుండి . ఎంతో సంతోషంగా , ఉత్సాహం గా , మతాబులు, చిచ్చు బుడ్లు అన్నయ్యలు తో పోటీ పడుతూ చేసేవాళ్ళం. ఇంట్లోనే మైదా పిండి తో బంక చేసి, న్యూస్ పేపర్ కట్ చేసి వాటిని జాగ్రత్తగా చుట్టి ఒకపక్క ఈ మైదా పిండి తో చేసిన పేస్ట్ తో అంటించి, మతాబులు కి తయారు చేయడం ,సురే కారం రజ ను ఇంకా గంధకం ఇవ్వన్నీ సమ పా ల ల్లో కలపటం , అవ్వన్నీ చేయడం ,అన్నయ్యలు , ఇంకా పని చేసే వాళ్ళు మెయిన్ గా చేసినా పక్కనే కూర్చుని ఏదో పని చేసినట్లు యాక్షన్ మాత్రం తప్పక చేసే వాళ్ళం. ఏం చేసినా చేయక పోయినా చిచ్చు బుడ్లు లో , మతాబులు లో కొంచెం ఇసుక మాత్రం పోసే వాళ్ళం. మేము హైదరాబాద్ వచ్చాక మావారు కూడా మా పిల్లల చేత చిచ్చు బుడ్లు తయారు చేయించారు ఒక ఏడాది మాత్రం చిచ్చు బుడ్లు బాంబు ల లాగా పేలి మంచి అనుభవం ఇచ్చాయి.
మా అత్తయ్య గారుబెల్లం లడ్డు, జిలేబి చేయటం లో ఎక్స్పర్ట్.మా అమ్మగారు మాత్రం ఎపుడూ దీపావళి అంటే కజ్జికాయలు చేసే వారు . నరక చతుర్దశి రోజున తెల్లవారుజామున లేచి తలంటు స్నానం చేసి కాసిని పువొత్తులు కాల్చి, స్వీట్ తింటే గానీ నరకుడిని చంపినట్లు కాదు. ఇపుడు అలా ఎవరయినా చేస్తున్నారో లేదో తెలియదు. దీపావళి అంటే అసలైన హడావిడి దీపాలు పెట్టడం కాకుండా రంగు కాగితాలతో గుమ్మటం తయారు చేయడం ఒక పెద్ద పని. వెదురు బద్దలు తో చేసిన గుమ్మటం చేసి దానికి రంగు రంగులు కాగితాలతో అలంకరించి రోజూ దానిలో ఒక దీపం పెట్టే వాళ్ళు. ఇపుడు అవి అంతగా కనిపించడం లేదు. దీపావళి పండుగ వెళ్ళాక కార్తీక మాసం అంతా చాలా హడావిడి వుండేది. ఇపుడు ఇంకా ఎక్కువగా ఉంటున్నది. శిశిరం లో వసంతం లాగా కొన్ని జ్ఞాపకాలు మనసుకు ఆహ్లాదం కలిగిస్తూ ఉంటాయి. కార్తీక మాసంలో మొదటగా గుర్తు వచ్చేది మా నాన్న గారి అభిషేకాలు. నాన్న గారు కార్తిక సోమ వారం , పౌర్ణమి రోజున తప్పక అభిషేకం చేసే వారు. ఈ రోజుల్లో లాగా ఉపవాసం ఉంటే కాఫీలు తాగడం ఉండేది కాదు పరమ నిష్ఠ గా ఉదయాన్నే చన్నీటి స్నానం చేసే వారు. శివాభిషేకం కు కావలసిన పూలు కూడా ఆయనే మా అత్తయ్య గారి తోట నుండి తెచ్చుకునే వారు. ప్రత్యేకంగా పున్నాగ పూలు, అవిశ పూలు, బిల్వ దళాలు పచ్చ గన్నేరు పూలు తెచ్చుకునే వారు. కనీసం ఒక ఐదు, ఆరుగురు బ్రాహ్మణులు తో కలిసి నాన్న గారు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించి చేయడం అలా మనసులో గుర్తు ఉండి పోయింది.. ఇప్పటికీ ఎపుడు అభిషేకాలు జరిగినా నాన్న గారు చదివిన మహన్యాసం, మంత్ర పుష్పము, దీక్షగా చదువుతున్న ఆయన రూపం అలా కళ్ల ముందే వుంటుంది ఆ రోజు మేమూ ఉపవాసం ఉన్నా ఏవో పండ్లు తినే వాళ్ళం ఇంకొక విశేషము ఏమిటంటే కార్తీక మాసం లో అవిశ కూర తింటే పుణ్యము అని ఆ ఆకు తో కూర చేసే వాళ్ళు అది చేదు గా ఉంటుంది అని కొంచెం పంచదార వేసే వాళ్ళు , మేము అందరం తప్పక తినాల్సిందే నేను ఆ తర్వాత ఆ చెట్లు ఎక్కడా చూడలేదు పూలు కూడా శివలింగం మీద నాగ పడగ విప్పినట్లు గా లేత పసుపు రంగు లో ఉండేవి, ఇప్పుడు పిల్లలని తినమంటే పుణ్యం ఎక్కడ ఉంటుంది ఎలా వస్తుంది అని అడుగుతారు అనుకుంటా, ఇంకొక విశేషము ఆకాశ దీపం పెట్టడం మా తాత గారు మొదలు పెట్టారు అనుకుంటా, వాకిలి ముందు ఒక పెద్ద స్తంభం పాతి ఒక ఇత్తడి లాంతరు లాంటి డబ్బా లో రోజూ దీపము పెట్టి మెల్లగా తాడు తో స్తంభం పై దాకా లాగి కట్టే వారు, మా చిన్న నాయనమ్మ రోజూ సాయంత్రం పూట మడి గా ఆ దీపం పెట్టే వారు , ఆ తర్వాత నేను ఆ ఆకాశ దీపం గురించి కార్తీక పురాణం లో చదివాను , రెండు మూడు గుళ్ళల్లో చూసాను, ఇంక మా చిన్న నాయనమ్మ గురించి రాయకుండా కార్తీక పురాణం పూర్తి కాదు, ద్వాదశి నాడు అప్పట్లో ఆ తిథులు గురించి తెలియదు అనుకోండి, తులసి కోట చుట్టూ దీపాలు వెలిగించడం ఒక మధురమైన జ్ఞాపకము, ఎర్రంచు పట్టు ధోవతి తో శుచి గా మమ్మల్ని గుడి కి తీసుకొని వెళ్ళేది, ఒక చిన్న సంచీలో బియ్యం చిల్లర ఇచ్చి మా చేత బీద వాళ్ళకు దానం ఇప్పించేది,
ఆ రోజుల్లో వాళ్లకు మట్టి ప్రమిదలు ముట్టు కొనే వారు కాదు ,గుడిలో ముగ్గులు వేసి కొబ్బరి చిప్ప లో అవునేతి దీపాలు వెలిగించే వాళ్ళం
ఆ మూడు వందల వత్తులు ముందు గా చేసి పెడితే మేము లెక్క పెట్టీ ఒక కట్ట లాగా కట్టే వాళ్ళం , అలా మాకు ఎన్నో మంచి అలవాట్లు, నేర్పిన మా చిన్న నాయనమ్మ ధన్య జీవి, మొన్న ఏకాదశి నాడు గుడికి వెళ్ళి ప్రమిద లు అడిగితే షాపు అతను ఒక అట్ట పెట్టె ఇచ్చాడు , అందులో ఒక ప్రమిదలో మూడు వందల వత్తులు నెయ్యి లో తడిపి ఒక అగ్గి పెట్టె తో సహా 50 రూపాయలు కి అమ్ముతున్నాడు
ఓహో లైఫ్ ఇస్ మేడ్ సో ఈజీ అనుకున్నాను,ఈ మధ్య నా మనవరాలి నీ నా బ్లాగు లో రాసినవి ఒక బుక్ లాగా చేయమంటే ఒక అందమైన బుక్ లాగా చేసి జ్ఞాపకాల తోరణాలు అని హెడ్డింగ్ పెట్టింది తెలుగు సరిగ్గా రాని మా బంగారు తల్లికి ఇంతటి గొప్ప పేరు ఎలా వచ్చిందో అనుకుంటూ అడిగితే గూగుల్ గారి మహిమ అమ్మాయి గారి ఇంగ్లీష్ కి అలా ఒక చక్కటి అనువాదం చేసింది, ఓహో అని సంతోషించాను,


Comments